సీఈసీ నియామక చట్టంపై ముగిసిన వాదనలు..
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) నియామకానికి సంబంధించి 2023లో తెచ్చిన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి పంపించాలా? వద్దా? అన్న అంశంపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. సీఈసీ నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తికి (సీజేఐ) స్థానం లేకపోవడంపై అభ్యంతరం తెలుపుతూ పలువురు ఈ పిటిషన్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే.సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకాల కమిటీలో సీజేఐ తొలగింపును కేంద్రం సమర్థించుకుంది. సీఈసీ నియామకానికి సంబంధించి నూతన చట్టంతో ఎన్నికల కమిషన్ స్వయంప్రతిపత్తి దెబ్బతినదని సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రధాని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారని ముందే భావించడం తప్పు అని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆర్టికల్ 324(2) ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకాలపై చట్టం చేసే అధికారం పార్లమెంట్కు ఉందని కేంద్రం తెలిపింది. నియామక కమిటీలో సీజేఐ తప్పనిసరిగా ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని పేర్కొంది. కమిషనర్ల పదవీ భద్రతే ఈసీ స్వయంప్రతిపత్తికి మూలస్తంభం అని కేంద్రం అభిప్రాయపడింది.