🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 08 Aug, 2026 | Page: 1

రాహుల్‌గాంధీ వైఖ‌రి మారిన‌ట్లుంది..

మహిళల స్వేచ్ఛపై కాంగ్రెస్‌ అగ్రనేత (Congress Top Leader) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. గురువారం నిర్వహించిన ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌ (Ask me Anything)’ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ.. మహిళలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పగలిగే పరిస్థితి ఉండాలని అన్నారు. శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) లో ఈ అంశంపై మరింత వివరంగా పేర్కొన్నారు. దీనిపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) స్పందించారు.మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కాంగ్రెస్‌ ఇప్పుడు బేషరతుగా మద్దతు ఇవ్వాలని కోరారు. మహిళల్లో ఉన్న శక్తి పూర్తిస్థాయిలో బయటకు రావడం లేదని రాహుల్‌ అన్నారు. మహిళలు తమకు నచ్చిన విషయాలపై స్వేచ్ఛగా మాట్లాడాలని చెప్పారు. ఇళ్లలో, కుటుంబాల్లో, సమాజంలో తమ అభిప్రాయాలను చెప్పే అవకాశం ఉండాలని పేర్కొన్నారు. కుటుంబసభ్యులు అంగీకరించని విషయాలపై కూడా మహిళలు తమ అభిప్రాయం చెప్పగలగాలని అన్నారు. పురుషుల ఆధిపత్యం నుంచి మహిళలకు కొంత స్వేచ్ఛ అవసరమని చెప్పారు.అప్పుడే దేశం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాహుల్‌ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ వైఖరిలో మార్పునకు సంకేతంగా కనిపిస్తున్నాయని రిజిజు అన్నారు. ‘మహిళల విషయంలో రాహుల్‌గాంధీ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్‌ మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు బేషరతుగా మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నా’ అని చెప్పారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును 2023లో పార్లమెంట్‌ ఆమోదించింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించేలా ఈ చట్టం ఉంది. అయితే దీని అమలుకు నియోజకవర్గాల పునర్విభజన అవసరం.
🏠 Home