నేతన్న కడుపు కొడుతున్న కాంగ్రెస్ సర్కారు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల కడుపు కొడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. ఈ మేరకు రాష్ట్రంలోని నేతన్నల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి శుక్రవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ హయాంలో అమలైన చేనేత సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నేతన్నలకు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలేదని తెలిపారు. చేనేత రంగం విషయంలో బీజేపీ-కాంగ్రెస్ వైఖరి ఒక్కటేనని విమర్శించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలతోనూ నేతన్నలకు తీవ్ర నష్టం జరుగుతున్నదని తెలిపారు. చేనేత రంగానికి కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు, హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు, పవర్లూమ్ బోర్డులను రద్దు చేయడం, హౌస్ కమ్ వర్క్షెడ్ వంటి పథకాలను ఎత్తేయడం, చేనేత ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీ విధించడం వంటి నిర్ణయాలు చేనేత రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొన్నారు.