🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 14 Jun, 2026 | Page: 1

నవగ్రహాలు ఎక్కువగా శివాలయాల్లోనే ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

గ్రహ సంబంధమైన దోషం ఉందనగానే చాలా మంది అనేక విధాలుగా కంగారు పడిపోతారు. ఇటు శివునికి, అటు నవగ్రహాలకు అభిషేకాలు, జపాలు, దానాలు అంటూ ఆలయాల చుట్టూ తిరుగుతుంటారు. గ్రహసంబంధమైన దోషాలు ప్రశాంతమైన జీవితాన్ని అనూహ్యమైన రీతిలో ప్రభావితం చేస్తాయని భయాందోళనలకి గురి కావడం సహజమే! ఇలాంటి గ్రహ దోషాల నుంచి ఉపశమనం కల్గించడానికి అత్యంత శక్తిమంతమైనవిగా భావించేవి నవగ్రహాలు. అయితే ఎక్కువగా నవగ్రహాలు శివాలయంలోని ఎందుకు వెలసి ఉంటాయి? ఇందుకు ఏదైనా ప్రత్యేక కారణం ఉందా! ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

నవగ్రహాలు శివాలయాల్లోనే ఎందుకు?
సాధారణంగా నవగ్రహాలు శివాలయాల్లోనే దర్శనమిస్తాయి. అరుదుగా కొన్ని ప్రాంతాల్లో వైష్ణవ సంబంధమైన క్షేత్రాల్లో కూడా కనిపిస్తుంటాయి. కానీ ఎక్కువ భాగం శివాలయాల్లోనే నవగ్రహాలు వెలసి ఉండడానికి గల కారణాలేంటో చూద్దాం.

నవగ్రహాల్లో అవినాభావ సంబంధం
శివాలయాల్లో ఎక్కువగా నవగ్రహాలు వెలసి ఉంటాయి. సాధారణంగా నవగ్రహాలు ఒక ప్రత్యేక మంటపంలో వెలసి ఉంటాయి. కొన్ని ప్రత్యేక క్షేత్రాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేకమైన మందిరం కనిపిస్తూ ఉంటుంది. అసలు నవగ్రహాలు ఎలా కొలువై ఉన్నప్పటికీ అసలు ఇవి ఎక్కువగా శివాలయాల్లోనే ఎందుకు ఉంటాయనే సందేహం కొంత మందికి కలుగుతుంటుంది. ఈ విషయంలో నవగ్రహాలకు శివునికి ఉన్న ప్రత్యేకమైన సంబంధమే కారణమని అంటారు. వాస్తవానికి నవగ్రహాలకు శివునికి గల సంబంధాన్ని గురించి శాస్త్రంలో చాలా స్పష్టమైన వివరణ ఉంది. అదేంటో చూద్దాం.

నవగ్రహాల అధిపతి
సనాతన ధర్మశాస్త్రం ప్రకారం పరమేశ్వరుడు నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో అధిష్టాన దేవతను నియమించినట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యదేవునికి అధిదేవత కూడా శివుడే! ఈ కారణంగానే గ్రహాలన్నీ కూడా శివుడి ఆదేశానుసారమే సంచరిస్తూ ఉంటాయని శాస్త్రంలో వివరించి ఉంది. అందువల్లనే శివాలయాల్లో నవగ్రహ మంటపాలు ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి.

నవగ్రహాలు కవచంగా
ఇక పరమేశ్వరుడు నవగ్రహాలనే కవచంగా ధరించి ఉంటాడంట! అందుకే పరమేశ్వరుని ఆశ్రయిస్తే ఎలాంటి గ్రహబాధలైనా తొలగుతాయని అంటారు. అందుకు నిదర్శనంగా శ్రీకాళహస్తిలో శివుడు నవగ్రహ కవచంతో దర్శనమిస్తాడు. అందుకే ఈ క్షేత్ర దర్శనంతో ఎలాంటి గ్రహ దోషాలైనా తొలగుతాయని విశ్వాసం.

పంచముఖ నాగలింగేశ్వరునిగా
శ్రీకాళహస్తి రాహు కేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గురైన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగ రూపం కారణంగా ఈ క్షేత్రానికి రాహు కేతు క్షేత్రం అని పేరు వచ్చింది.

గ్రహణ కాలంలో కూడా తెరచి ఉంచే ఏకైక ఆలయం
సాధారణంగా గ్రహణాల సమయంలో దేశంలోని ఆలయాలన్నీ మూసివేస్తారు. కానీ శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిచే ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం శ్రీకాళహస్తి అత్యంత శక్తివంతమైన రాహు-కేతు క్షేత్రంగా వెలసి ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. గ్రహణాలు రాహు, కేతువుల వల్లే సంభవిస్తాయి కాబట్టి, ఈ ఆలయానికి ఆ దోషాలు అంటవని భక్తుల నమ్మకం.
🏠 Home