Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

20 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన విమానం - సీఎం రేవంత్​ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

Author Neti Sudiksha | 30 Jul 2026, 02:12 PM | హైదరాబాద్
20 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన విమానం - సీఎం రేవంత్​ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్​లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్​లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. దిల్లీ నుంచి హైదరాబాద్​ బయల్దేరిన ఇండిగో (6e717) విమానానికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్​లో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ల్యాండింగ్​కు క్లియరెన్స్ రాలేదు. దాంతో ల్యాండింగ్ అవుతున్న సమయంలో విమానాన్ని పైలట్ తిరిగి టేకాఫ్ చేశాడు. 20 నిమిషాల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. బుధవారం రాత్రి 8:35 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. విమానంలో సీఎం రేవంత్ రెడ్డి సహా 229 మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతరం విమానం సేఫ్‌గా ల్యాండింగ్ అవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

3 రోజులు దిల్లీలో బిజీ బిజీ : సోమవారం మధ్యాహ్నం దిల్లీ చేరుకున్న సీఎం రేవంత్​ రెడ్డి అదే రోజు సాయంత్రం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నిర్వహించిన సమీక్షా సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్‌తో కలిసి హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, సంస్థాగత వ్యవహారాలపై చేపడుతున్న కార్యక్రమాలు, సంఘటనా సృజన్‌ అభియాన్‌ అమలు, సంస్థాగత శిక్షణ కార్యక్రమాలు, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం వంటి అంశాలపై చర్చించారు.

మంగళవారం ఉదయం పార్లమెంటుకు వెళ్లిన రేవంత్​ రెడ్డి పార్టీకి సంబంధించిన పలువురు నేతలను, కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలతో ముచ్చటించారు. ఆ తర్వాత కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి శివరాజ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. గత 12 ఏళ్లలో రాష్ట్రానికి గ్రామీణాభివృద్ది శాఖ నుంచి ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదని, మిగతా రాష్ట్రాలకు రూ.వేల కోట్లు ఇచ్చినా తెలంగాణ తీసుకోలేదన్న విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 11.56 లక్షల మంది అర్హత కలిగిన పేదల కోసం గ్రామీణాభివృద్ది శాఖ నుంచి ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో వ్యవసాయ సమస్యలు : ఉపాధి హామీ నిధుల విడుదల, కొత్త పనులకు సంబంధిత శాఖ రాష్ట్ర మంత్రి ఇచ్చిన ప్రతిపాదనలపై కూడా చర్చించిన రేవంత్‌ రెడ్డి, ఎల్‌నినో వల్ల వర్షాలు లేకపోవడం, కరవు పరిస్థితులు, పంటల ఉత్పత్తి తగ్గుదల, రకరకాల వ్యవసాయ సమస్యలు ఉత్పన్నం అవుతున్నందున కేంద్రం నుంచి క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించి అంచనా వేసేందుకు అధికారుల బృందాలను పంపి రాష్ట్రంలో పర్యటించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం తన ప్రతిపాదనలకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే కేంద్ర బృందాలను పంపడంతో పాటు ఇళ్లు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

అదే సందర్బంలో హైడ్రాపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఖండించారు. కబ్జాలు చేసేవాళ్లే హైడ్రాను వ్యతిరేకిస్తున్నారని, ఇకపై కూడా హైడ్రా కొనసాగుతుందని తేల్చి చెప్పారు. హైకోర్టు ఆదేశాలను పరిశీలించాక తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇకపై తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సమస్య ఉండదని స్పష్టం చేశారు. అదే రోజు సాయంత్రం తనను కలిసిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ వ్యవస్థాపకులు పవన్‌ కుమార్‌ చందన, నాగభరత్‌లను సీఎం అభినందించారు. సాంకేతిక పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ అనుకూలం అని వారికి చెప్పారు.

బుధవారం సాయంత్రం హైదరాబాద్​కు : బుధవారం కాంగ్రెస్‌ కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్‌లో జరిగిన రాష్ట్ర పార్టీ సమన్వయ కమిటీ భేటీకి తెలంగాణ నేతలతో కలిసి హాజరయ్యారు. అక్కడే పలువురు పార్టీ నేతలను కలుసుకున్న సీఎం, సాయంత్రం తిరిగి హైదరాబాద్‌ పయనం అయ్యారు. ఆ సందర్భంలోనే హైదరాబాద్ చేరుకున్న విమానానికి శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​ నుంచి ల్యాండింగ్​కు క్లియరెన్స్​ లభించకపోవడంతో 20 నిమిషాల హైడ్రామా అనంతరం విమానం సేఫ్​గా ల్యాండ్​ అయ్యింది.